తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన టీవీకే అధినేత విజయ్కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఊహించని షాక్ ఇచ్చారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన విజయ్కు, సంఖ్యాబలం విషయంలో స్పష్టమైన నిబంధనలను గవర్నర్ తెలిపారు. తగినంత మెజారిటీ లేనిదే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేమని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 118. అయితే ప్రస్తుత సమీకరణాల ప్రకారం టీవీకే బలం 108 సీట్లు. మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ బలం 5 సీట్లు. దీంతో మొత్తం బలం 112 అవుతుంది. ఈ క్రమంలో విజయ్ పార్టీకి మరో 6 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
విజయ్ గవర్నర్తో మాట్లాడుతూ, కాంగ్రెస్తో పాటు మరికొన్ని చిన్న పార్టీలు తమకు మద్దతు ఇస్తున్నాయని, ప్రమాణస్వీకారం తర్వాత అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటానని వివరించారు. ముందే 118 మంది సభ్యుల సంతకాలతో కూడిన మద్దతు లేఖ ఉంటేనే ఆహ్వానిస్తామని గవర్నర్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకే పార్టీకి ఉన్న 47 మంది ఎమ్మెల్యేలలో సీవీ షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం (సుమారు 35 మంది) విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
