అన్నమయ్య జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న నాలుగు 104 వాహనాలు రహస్యంగా మాయమవ్వడం కలకలం రేపుతోంది. మరమ్మతుల సాకుతో పక్కన పెట్టిన ఈ వాహనాలను కొంతమంది సిబ్బంది ఏకంగా డంపింగ్ యార్డుకు తరలించి, తుక్కుగా మార్చి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
వాహనాలు మాయమైన ఆరు నెలల తర్వాత జిల్లా వైద్యాధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎవరి అనుమతి లేకుండానే ఈ వాహనాలను డంపింగ్ యార్డుకు తరలించి, వాటి విడిభాగాలను విడదీసి అమ్ముకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసుపత్రి ప్రాంగణం నుంచి భారీ వాహనాలు తరలిపోతుంటే ఉన్నతాధికారులకు తెలియకుండా ఎలా జరుగుతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక కొందరు ఆసుపత్రి సిబ్బంది హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ మరియు వైరల్ వీడియోల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.రాయచోటి నియోజకవర్గ ప్రతినిధి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే ప్రభుత్వ వాహనాల దొంగతనం జరగడం సంచలనంగా మారింది.
