రాయలసీమ ప్రాంతానికి రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని కోరుతూ ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఎంపీ పురందేశ్వరి, అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్ ఉన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయిన మంత్రి, బెంగళూరు నుంచి కడప వరకు కొత్త రైల్వే లైన్ ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన అశ్విని వైష్ణవ్ సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తో సమావేశమై కడప విమానాశ్రయం అభివృద్ధిపై చర్చించారు. కడప నుండి దేశంలోని ప్రధాన నగరాలకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభించాలని, విమానాశ్రయంలో మౌలిక సదుపాయాలు పెంచాలని విన్నవించారు. రాయలసీమ పారిశ్రామికంగా ఎదగాలంటే మెరుగైన రవాణా వ్యవస్థ అత్యవసరమని, తద్వారా పర్యాటక రంగం కూడా లాభపడుతుందని మంత్రి వివరించారు.కేంద్ర మంత్రుల నుంచి సానుకూల స్పందన రావడంతో రాయలసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

