ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్లకు సంబంధించి తొలి ఘట్టం ఘనంగా ప్రారంభమైంది. నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఏటా నిర్వహించే మున్సిపల్ ప్రభ ప్రత్యేక పూజలు గురువారం వైభవంగా జరిగాయి.

మహాశివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి నాడు మున్సిపల్ కార్యాలయం నుంచి బయలుదేరే ప్రభ కోటప్పకొండకు చేరుకుంటుంది. తిరునాళ్లలో తొలి ప్రభగా దీనికి మొక్కులు చెల్లించుకోవడం 95 ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. మున్సిపల్ అధికారులు, సిబ్బంది ప్రభకు ప్రత్యేక పూజలు నిర్వహించి కోటప్పకొండకు పంపారు. ఈ ప్రభ కొండకు వెళ్లడం వల్ల పట్టణ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉంటారని స్థానికుల ప్రగాఢ నమ్మకం.మేళతాళాలు, శివనామ స్మరణల మధ్య అలంకరించిన మున్సిపల్ ప్రభ భక్తుల సందడితో కోటప్పకొండ వైపు కదిలింది.
