రాపూరు మండలంలోని వెలుగొండ అటవీ ప్రాంతంలో దారి తప్పి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 12 మంది పర్యాటకులను పోలీసులు సురక్షితంగా రక్షించారు. నెల్లూరు నగరంలోని అయ్యప్ప గుడి ప్రాంతానికి చెందిన 20 మంది బృందం మహాశివరాత్రి పురస్కరించుకుని మామిడి కోన సందర్శనకు వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో ఎనిమిది మంది క్షేమంగా బయటకు రాగా, మిగిలిన 12 మంది దట్టమైన అడవిలోకి వెళ్లారు. చీకటి పడటంతో దారి తెలియక అడవిలో చిక్కుకుపోయారు. పర్యాటకులు 112 నంబర్కు కాల్ చేయడంతో, జిల్లా ఎస్పీ అజిత వేజేండ్ల ఆదేశాల మేరకు రాపూరు CI సత్యనారాయణ బృందం రంగంలోకి దిగింది. టెక్నాలజీ సాయంతో వారి లొకేషన్ను ట్రాక్ చేసిన పోలీసులు, రాత్రి 10 గంటల సమయంలో అడవి లోపల వారిని గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.తమ ప్రాణాలు కాపాడిన రాపూరు పోలీసులకు పర్యాటకులు మరియు వారి కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
