శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులను ఏప్రిల్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.

పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని, రేయింబవళ్లు పనులు జరిపి ఏప్రిల్ నాటికి వంతెనతో పాటు సర్వీసు రోడ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల పలాస పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని పేర్కొన్నారు. పలాస నెమలికొండ ప్రాంతంలో నిర్మించనున్న కేంద్రీయ విద్యాలయ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు, రైల్వే కాలనీలోని బారక్ భవనాల్లో జూన్ (రాబోయే విద్యా సంవత్సరం) నుండి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. రైల్వే అధికారులతో మాట్లాడి భవనాల అప్పగింతకు ఉన్న అడ్డంకులను తొలగించారు. ఈ పాఠశాల ద్వారా జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.”కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన పలాస ROB పనులకు జీవం పోశాం” అని మంత్రి ఈ సందర్భంగా మీడియాతో పేర్కొన్నారు.
