ఓబులాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ మైనింగ్ కేసులో సీనియర్ IAS అధికారిణి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలంటూ (డిశ్చార్జ్) ఆమె దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో ఆమె దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.
విచారణ సందర్భంగా జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. “గతంలో వేరే కేసుగా భావించి పొరపాటున ఈ కేసులో స్టే ఇచ్చాం.. ఆ పొరపాటు వల్ల వచ్చిన స్టేను నిందితులు ఇన్నాళ్లూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నాం” అని పేర్కొంటూ స్టేను ఎత్తివేసింది.గనుల శాఖ కార్యదర్శిగా ఉన్న సమయంలో శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఓఎంసీకి లబ్ధి చేకూర్చారని, ‘క్యాప్టివ్ మైనింగ్’ షరతును ఉద్దేశపూర్వకంగా తొలగించారని CBI వాదించింది. ఈ నేపథ్యంలో, ఆమె ట్రయల్ కోర్టులో విచారణను ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
