సంక్రాంతి లక్కీ డ్రా కేసుతో పాటు పలు కేసుల్లో బెయిల్ మంజూరవ్వడంతో మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలయ్యారు. 18 రోజుల రిమాండ్ అనంతరం బయటకు వచ్చిన ఆయన, ప్రభుత్వం మరియు పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
“నన్ను 18 రోజులు జైల్లో పెడితే భయపడతాననుకున్నారు, కానీ నన్ను భయపెట్టడం ఎవరి వల్ల కాదు. ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యను.” ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై తనపై అక్రమ కేసులు పెట్టారని, జైల్లో తనను చంపడానికి కూడా ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. తన కష్టకాలంలో మద్దతు తెలిపిన వైసీపీ శ్రేణులతో పాటు, ఇతర పార్టీలకు చెందిన వారు కూడా తనకు సపోర్ట్ చేయడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆనాడు వైఎస్సార్ వెనుక నడిచామని, ఈనాడు జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉంటూ ఏ పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. జైలు జీవితాన్ని తాను బాధగా కాకుండా ఒక అనుభవంగా ఎంజాయ్ చేశానని వ్యాఖ్యానించారు.
