కృష్ణా జలాల విషయంలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై పోరాటాన్ని ఉధృతం చేస్తున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. శనివారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘ఛలో పోతిరెడ్డిపాడు’ విజయవంతం కావడంతో అదే స్ఫూర్తితో త్వరలో కడపలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలు, రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. మార్చి 1న దీనిపై కీలక సమావేశం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల వల్ల ఏపీకి నష్టం జరుగుతున్నా సీఎం చంద్రబాబు మౌనంగా ఉన్నారని విమర్శించారు. ఓటుకు నోటు కేసు భయం వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి కోసం పక్కన పెట్టారని ఆరోపించారు. 1996లో అల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతున్నప్పుడు అడ్డుకోలేకపోయిన బాబు, ఇప్పుడు కూడా కర్ణాటక చర్యలపై నోరు మెదపడం లేదని మండిపడ్డారు.సీమకు అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండటం పాపమని, టీడీపీలో ఉన్న వారు కూడా రాజీనామాలు చేసి ఈ ఉద్యమంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
