గత YSRCP ప్రభుత్వ హయాంలో కలువాయి మండలంలో జరిగిన భారీ భూ కుంభకోణంపై వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అసెంబ్లీలో గళమెత్తారు. సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూముల రికార్డులను ట్యాంపరింగ్ చేసి భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
తహసీల్దార్ స్థాయిలోనే రికార్డులు మార్చి, చనిపోయిన వారి పేర్ల మీద డీ-ఫామ్ పట్టాలు సృష్టించారని ఎమ్మెల్యే తెలిపారు.దళితులకు చెందిన అసైన్డ్ భూములను అక్రమంగా ఓసీల పేర్లకు బదిలీ చేసి, వాటిని ఒరిజినల్ పట్టాలుగా మార్చేశారని మండిపడ్డారు. నాయబ్రాహ్మణ కాలనీలో నకిలీ లేఅవుట్లు వేసి పేదల నుంచి డబ్బులు వసూలు చేసి దొంగ పట్టాలు విక్రయించారని ఆరోపించారు. వైసీపీ జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి కోట్ల రూపాయల లంచాలు తీసుకుని ఈ అక్రమాలకు పాల్పడ్డారని, దీనివల్ల మండలంలో హత్యాయత్నాలు కూడా జరిగాయని పేర్కొన్నారు.ఈ భూ కుంభకోణంపై తక్షణమే సీఐడీ దర్యాప్తు జరిపించాలని, ట్యాంపరింగ్కు గురైన రికార్డులను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సరిదిద్ది బాధితులకు న్యాయం చేయాలని కురుగొండ్ల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
