ATM కేంద్రాల వద్ద అమాయక వృద్ధులే లక్ష్యంగా కార్డులు మార్చి డబ్బులు కాజేస్తున్న పాత నేరస్థుడిని నర్సీపట్నం టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. సుకల నూకరాజు అనే వృద్ధుడు డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం వద్దకు రాగా, అక్కడ పొంచి ఉన్న మువ్వ వీరయ్య చౌదరి అనే కేటుగాడు సహాయం చేస్తున్నట్లు నటించి చాకచక్యంగా కార్డు మార్చేశాడు. అనంతరం వృద్ధుడి ఖాతా నుండి రూ. 15 వేలు కాజేశాడు.

నిందితుడు వీరయ్య చౌదరిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 19 కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు గుర్తించారు. సీఐ షేక్ గఫూర్ నేతృత్వంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏటీఎంల వద్ద గుర్తు తెలియని వ్యక్తులకు కార్డులు ఇవ్వవద్దని, పిన్ నంబర్ రహస్యంగా ఉంచాలని DSP ప్రజలకు సూచించారు.
