తిరుమల లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని మాజీ మంత్రి, వైకాపా నేత పేర్ని నాని ధ్వజమెత్తారు. మంగళవారం తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే భక్తుల మనోభావాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు.
అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను “అబద్ధాల ప్రజంటేషన్”గా పేర్ని నాని అభివర్ణించారు. నిబంధనలను ఎవరి కోసం సడలించలేదని, గత ఐదేళ్లలో నాణ్యత లేని వందలాది నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపిన రికార్డులు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక, బడ్జెట్లో కేటాయింపులు చూపలేక ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘లడ్డూ’ అంశాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ (SIT) కేవలం సాక్ష్యాలను సృష్టించేందుకే తప్ప నిజాలను బయటపెట్టడానికి కాదని.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లంచాల డైరీలంటూ కథలు చెప్పడం మానేసి, ధైర్యముంటే ఆధారాలను కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టడం లేదని నిలదీశారు.
