జిల్లా కేంద్రంలోని పలు వీధుల్లో అతిసారం (డయేరియా) ఒక్కసారిగా ప్రబలి కలకలం సృష్టించింది. దమ్మలవీధి, గుడివీధి, మంగువారితోట ప్రాంతాల్లో సుమారు 91 మంది అస్వస్థతకు గురవ్వగా, సురేష్ (42) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందారు. పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే జిల్లా కలెక్టర్తో సమీక్ష నిర్వహించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నేతృత్వంలో ఇంటింటి సర్వే ప్రారంభమైంది. మున్సిపల్ నీటి సరఫరాను నిలిపివేసి, ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు.ప్రభావిత ప్రాంతాల్లో 24 గంటల పాటు వైద్య శిబిరాలు, 4 అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. బాధితులను రిమ్స్, కిమ్స్ ఆసుపత్రులకు తరలించారు.కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ నిరంతరం కలెక్టర్తో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.కలుషిత నీరే కారణమని ప్రాథమికంగా భావిస్తున్న అధికారులు, నీటి నమూనాలను ల్యాబ్కు పంపారు. ప్రజలు నీటిని కాచి, చల్లార్చి తాగాలని కలెక్టర్ సూచించారు.
