అగిరిపల్లిలోని ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NRI Institute of Technology) విద్యార్థులకు ఏపీ శాసనసభలో అరుదైన అనుభవం ఎదురైంది. AI&ML విభాగానికి చెందిన విద్యార్థులు నేడు అసెంబ్లీని సందర్శించి, సభా కార్యక్రమాలను నేరుగా వీక్షించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని కలిశారు.

విద్యార్థులతో ముచ్చటించిన మంత్రి, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు దేశ పాలనా వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.విద్యార్థులు తమకు పోలవరం ప్రాజెక్టును చూసే అవకాశం కల్పించాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. విద్యార్థుల ఉత్సాహాన్ని చూసి సంతోషించిన ఆయన, పోలవరం సందర్శన ఏర్పాటు చేస్తానని, దానికి అయ్యే ఖర్చును తానే స్వయంగా భరిస్తానని హామీ ఇచ్చారు.మంత్రి చూపిన చొరవకు, తమకు అసెంబ్లీని చూసే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటన తమ జీవితంలో ఒక మరపురాని జ్ఞాపకంగా నిలిచిపోతుందని వారు పేర్కొన్నారు.

