చట్టసభల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ, క్షేత్రస్థాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకురావాలని జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. సోమవారం అసెంబ్లీలోని జనసేన శాసనసభా పక్ష కార్యాలయంలో ఆయన పార్టీ ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు.
శాసనసభ, మండలిలో చర్చల్లో పాల్గొనే సమయంలో పూర్తి పరిజ్ఞానంతో మాట్లాడాలని, సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని మనోహర్ సూచించారు. వైసీపీ కులాల మధ్య పెడుతున్న చిచ్చుల గురించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని, ప్రభుత్వ అభివృద్ధిని ఇంటింటికీ చేరవేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ‘పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆదేశించారు.విలువలతో కూడిన రాజకీయాలకు చట్టసభలు వేదిక కావాలని, ప్రాధాన్యత క్రమంలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
