జిల్లా కేంద్రంలో డయేరియా ప్రబలిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గురువారం నగరంలోని ఆసుపత్రులను సందర్శించి బాధితులను పరామర్శించారు.

వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయంతో సహాయక చర్యలు ముమ్మరం చేశామని మంత్రి తెలిపారు. నాలుగున్నర సచివాలయాల పరిధిలో ఇప్పటివరకు 102 కేసులు నమోదయ్యాయి. వీరిలో 30 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 85 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డయేరియా కారణంగా ఒకరు మృతి చెందగా, మరొకరు ఇంట్లోనే మరణించారని మంత్రి ధృవీకరించారు. 50 వైద్య బృందాలతో ఇంటింటికీ తిరిగి సర్వే (Door to Door Survey) చేశామని, లక్షణాలు ఉన్నవారిని తక్షణమే ఆసుపత్రికి తరలిస్తున్నామని చెప్పారు. ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి అధికారులనైనా ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు.ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని ఆయన భరోసా ఇచ్చారు.

