గత రెండేళ్లుగా ఒంటరి మహిళలే లక్ష్యంగా మంగళసూత్రాలు, బంగారు గొలుసుల దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగ కొయ్యపు గిరి రాజశేఖర్ను మన్యం జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 16 బంగారు మంగళసూత్రాలు, ఇతర ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ రెడ్డి వెల్లడించారు.
నిందితుడు రాజశేఖర్ పార్వతీపురం జిల్లాలో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి, అతి చాకచక్యంగా గొలుసు దొంగతనాలకు పాల్పడేవాడు. వరుస చోరీలతో పోలీసులకు సవాల్ విసిరిన నిందితుడు, పట్టుబడకుండా ఉండేందుకు నిరంతరం సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు మారుస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజ్ మరియు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడి కదలికలపై నిఘా పెట్టాయి. సీతానగరం మండలం గుచ్చిమి జంక్షన్ వద్ద సంచరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, మఫ్టీలో వాహన తనిఖీలు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 14 కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ తెలిపారు.దొంగిలించిన బంగారంతో జల్సాలు చేస్తున్న ఈ గజదొంగను పట్టుకున్న పోలీస్ టీమ్ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
