ఆంధ్రప్రదేశ్లోని ‘NTR భరోసా’ పింఛన్ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. మార్చి నెలకు సంబంధించిన పింఛన్లను ఒకరోజు ముందుగానే, అంటే ఫిబ్రవరి 28వ తేదీనే పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మార్చి 1వ తేదీ ఆదివారం (సెలవు దినం) కావడంతో, లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఫిబ్రవరి 28నే పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 62.76 లక్షల మందికి గాను ప్రభుత్వం రూ. 2725.79 కోట్లు విడుదల చేసింది. ఈ నెల నుంచి కొత్తగా మంజూరైన 8,977 మంది వితంతు (స్పౌస్) లబ్ధిదారులకు కూడా పింఛన్లు అందనున్నాయి. వీరి కోసం అదనంగా రూ. 3.59 కోట్లు కేటాయించారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి పింఛన్ సొమ్మును అందజేస్తారు. ఫిబ్రవరి 28న పింఛను అందుకోలేని వారికి మార్చి 2వ తేదీన పంపిణీ పూర్తి చేస్తారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు పింఛన్ల కోసం మొత్తం రూ. 57,808.68 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి వివరించారు.
