ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరును బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం తీవ్రంగా ఖండించారు. సీనియర్ సభ్యుడిపై దాడులకు దిగడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని ఆయన మండిపడ్డారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ జరుగుతున్న సమయంలో సోము వీర్రాజు ప్రశ్న అడగకుండా అడ్డుకోవడమే కాకుండా, ఆయన చేతిలో ఉన్న మైకును లాక్కునేందుకు వైసీపీ ఎమ్మెల్సీలు ప్రయత్నించడం దుర్మార్గమని విమర్శించారు. సభలో మహిళా మంత్రులు ఉన్నారనే కనీస గౌరవం లేకుండా వైసీపీ సభ్యులు ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల తీరు మారలేదని, తాడేపల్లి ప్యాలెస్ సంస్కృతినే సభలో కూడా ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతుకను అణిచివేసే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని, సోము వీర్రాజుకు వైసీపీ సభ్యులు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైసీపీ తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
