మంగళగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు వేరువేరు దొంగతనాల కేసులను పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 38 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు.
గత ఏడాది అక్టోబర్లో దుగ్గిరాల గ్రామంలో ఓ ఇంటి తలుపులు పగులగొట్టి దొంగతనం జరిగింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిప్పడ కేదారేశ్వర రావు (40) అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి రూ. 16.32 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో వివిధ స్టేషన్లలో 40కి పైగా కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.ఈ నెల 19న చింతలపూడిలో జరిగిన మరో దొంగతనంపై విచారణ జరిపిన పోలీసులు ఇమ్మడబత్తిన గోపి (38) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ. 20 లక్షల విలువైన బంగారం, రూ. 1 లక్ష విలువైన వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీసు బృందాన్ని ఆయన అభినందించారు.
