కమలాపురం మండలం మాచిరెడ్డిపల్లె గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 30వ వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి విశేష అభిషేకాలు, మహామంగళహారతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు.

బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు మాచిరెడ్డిపల్లెలోని తమ స్వగృహంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కమలాపురం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు, ప్రసాద వితరణ చేపట్టారు.
