గత కొన్ని సంవత్సరాలుగా రాపూరు పట్టణ ప్రజలను బెంబేలెత్తిస్తున్న కోతుల సమస్యకు అధికారులు చెక్ పెట్టారు. స్థానిక ప్రజల నుండి వస్తున్న వరుస ఫిర్యాదులపై స్పందించిన అటవీ శాఖ మరియు పంచాయతీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కోతులను బంధించారు.
అటవీ శాఖ రేంజర్ మాల్యాద్రి ప్రత్యేక చొరవతో, సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఆధునిక పద్ధతులను ఉపయోగించి కోతులను పట్టించారు. టీడీపీ రాపూరు పట్టణ అధ్యక్షుడు కోటి నాయుడు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. పట్టణంలోని కోతులన్నింటినీ పూర్తిస్థాయిలో పట్టుకుని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పట్టుబడిన కోతులను సురక్షితంగా సమీపంలోని కూటలమర్రి అటవీ ప్రాంతానికి తరలించి వదిలిపెట్టారు.కోతుల బెడద తప్పడంతో రాపూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
