రాష్ట్రంలోని బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం బీసీ హాస్టల్లో డయేరియా కలకలం రేపిన నేపథ్యంలో ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
మారుతున్న వాతావరణ పరిస్థితులు, పరీక్షల సమయం దృష్ట్యా విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. చిన్నపాటి అనారోగ్యం తలెత్తినా వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రులకు తరలించాలని స్పష్టం చేశారు.రేళ్ల వీధి బీసీ హాస్టల్లో నలుగురు విద్యార్థులు డయేరియా బారిన పడటంపై మంత్రి ఆరా తీశారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకున్నారని అధికారులు వివరించగా, అక్కడ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థులకు కాచి చల్లార్చిన నీటిని, తాజా ఆహారాన్ని మాత్రమే అందించాలని, బయటి ఆహారాన్ని హాస్టళ్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని వార్డెన్లకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సంరక్షణలో నిర్లక్ష్యం వహించే డీబీసీడబ్ల్యూవోలు (DBCWOs), వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.పరీక్షల సమయంలో విద్యార్థులకు మానసిక ప్రశాంతతతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని ఆమె కోరారు.
