తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని భీమవరం, ఎల్లంపల్లి గ్రామాల్లో ఏనుగుల గుంపు రైతులను వణికిస్తోంది. గత మూడు రోజులుగా 13 ఏనుగుల గుంపు ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ పంటలను నాశనం చేస్తుండటంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
భీమవరానికి చెందిన కౌలు రైతు మునికృష్ణయ్య యాదవ్ ఐదు ఎకరాల్లో సాగు చేసిన వరి పంటను ఏనుగులు పూర్తిగా తొక్కి వేశాయి. రెండు లక్షల రూపాయల అప్పు తెచ్చి సాగు చేస్తే, ఇప్పుడు చేతికొచ్చిన పంట చేజారిందని ఆ రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. అటవీ శాఖ అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప, ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు బలమైన చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.
తక్షణమే అధికారులు స్పందించి గజరాజులను అటవీ ప్రాంతానికి తరలించాలని, నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఏనుగుల సంచారంతో రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లాలంటేనే అన్నదాతలు హడలెత్తిపోతున్నారు.
