అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన నిమిత్తం విశాఖ చేరుకున్న మంత్రి నారా లోకేష్, శనివారం ఉదయం టీడీపీ కార్యాలయంలో ‘ప్రజాదర్బార్’ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ప్రజలు, కార్యకర్తల నుంచి ఆయన స్వయంగా వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పూర్తిస్థాయి వేతన స్కేళ్లు వర్తింపజేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. అనకాపల్లి జిల్లా సీతపాలెం భూ నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం కల్పించి, స్థానికులకు ఉపాధి చూపాలని గ్రామస్తులు మంత్రిని వేడుకున్నారు. ప్రతిపాదిత ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల అనకాపల్లిలోని శ్రీ దుర్గాదేవి ఆలయానికి భంగం కలగకుండా చూడాలని భక్తులు విన్నవించారు. ఫార్మసీలో మాస్టర్స్ పూర్తి చేసిన విశాఖకు చెందిన యామిని అనే యువతి తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. అనకాపల్లికి చెందిన పి.సతీష్ కుమార్ తన ఇంటిని అక్రమంగా ధ్వంసం చేశారంటూ చేసిన ఫిర్యాదుపై మంత్రి సానుకూలంగా స్పందించారు.వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి లోకేష్, సంబంధిత అధికారులతో మాట్లాడి బాధితులకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

