ఆంధ్రప్రదేశ్లో పెను విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా వేట్లంపాడు – జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న ఒక బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 18 మంది కార్మికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం కుప్పకూలిపోయింది. మృతదేహాలు తునకలై పరిసరాల్లో చెల్లాచెదురుగా పడిపోయాయని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. మరో 15 మంది వరకు మంటల్లో చిక్కుకుని ఉండవచ్చని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు మరియు రెవెన్యూ యంత్రాంగం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాధితుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగిపోయింది.
