పార్వతీపురం మన్యం జిల్లాలో పోలీసులు అక్రమ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపారు. పట్టణ పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రెండు వేర్వేరు కేసుల్లో మొత్తం 92 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో సుమారు రూ. 46 లక్షలు ఉంటుందని అంచనా.

రెగ్యులర్ వాహన తనిఖీలు మరియు లాడ్జీల తనిఖీల్లో భాగంగా పోలీసులు ఈ గంజాయిని పట్టుకున్నారు. ఒక స్థానిక లాడ్జీలో 90 కేజీల గంజాయితో ముగ్గురిని, వాహనాల తనిఖీలో 2 కేజీల గంజాయితో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన ఐదుగురు నిందితుల్లో ఒకరు విశాఖపట్నంకు చెందిన వారు కాగా, మిగిలిన వారు బీహార్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఒడిశా నుంచి గంజాయిని సేకరించి పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు తరలించి సులువుగా డబ్బు సంపాదించడమే వీరి లక్ష్యమని పోలీసులు గుర్తించారు. 92 కేజీల గంజాయితో పాటు ఒక బైకు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. గంజాయి స్మగ్లింగ్ను సమర్థవంతంగా అడ్డుకున్న పట్టణ సీఐ వెంకట్రావు మరియు సిబ్బందిని ఏఎస్పీ మనీషా రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
