అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ (ABCWO) గడ్డి బాలముకుందరావు నివాసంలో ఏసీబీ అధికారులు సోమవారం ఉదయం నుంచి విస్తృత సోదాలు నిర్వహించారు. గత నెలలో లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటనకు సంబంధించి అక్రమ ఆస్తుల గుర్తింపు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి.
జనవరి 28వ తేదీన కంచిలిలో వార్డెన్ల నుంచి రూ. 1.84 లక్షలు లంచం తీసుకుంటుండగా బాలముకుందరావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బీసీ వసతి గృహాల్లో ఉంటున్న ఒక్కో విద్యార్థి నుంచి నెలవారీ రూ. 5 చొప్పున వసూలు చేయాలని వార్డెన్లపై ఒత్తిడి తెచ్చినట్లు ఇతనిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. సోమవారం శ్రీకాకుళం నగరంలోని డీసీసీబీ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో బృందాలు సోదాలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు మరియు అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆధారాలను అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది.లంచం కేసులో అరెస్టయిన అధికారి ఆస్తులపై లోతైన విచారణ జరుపుతున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
