గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతూ, రైతులకు భూమిపై పూర్తి భరోసా కల్పించేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మంగళవారం నాగాయలంక మండలం చోడవరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద 782 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు.
గత వైసిపి ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పాస్ పుస్తకాలపై మాజీ సీఎం జగన్ ఫోటో వేసి రైతుల్లో అభద్రతాభావాన్ని నింపారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ రాజముద్రతో అధికారిక పత్రాలను అందిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈసారి పాస్ పుస్తకాల ముద్రణకు ముందే రైతులు తమ వివరాలను సరిచూసుకునే అవకాశం కల్పించామని, తప్పులు ఉంటే సవరించిన తర్వాతే తుది ముద్రణ జరిగిందని ఆయన వివరించారు.కూటమి ప్రభుత్వం పూర్తిగా రైతుల హక్కుల పరిరక్షణకే ప్రాధాన్యత ఇస్తుందని, డిజిటల్ విధానంలో అత్యంత పారదర్శకమైన పాస్ పుస్తకాలను రూపొందించామని బుద్ధప్రసాద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి సాయిబాబు, తహసీల్దార్ వీరాంజనేయ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వరరావు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
