నాగాలాండ్ రాష్ట్రంలోని దిమాపుర రీజియన్ సుఖోవిలో ఉన్న అస్సాం రైఫిల్స్ ట్రైనింగ్ సెంటర్ & స్కూల్ లో శిక్షణ పూర్తి చేసుకున్న సైనికుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మొత్తం 762 మంది రిక్రూట్లు పరేడ్ నిర్వహించి కేంద్ర మంత్రి సమక్షంలో దేశ సేవకు ప్రమాణం చేశారు. అనంతరం సైనికుల పరేడ్ విన్యాసాలను బండి సంజయ్ పరిశీలించారు.

సైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ “మీరు భవిష్యత్తులో జవాన్లు, ఎన్సీఓలు, జేసీఓలుగా ఎదిగి దళ గౌరవాన్ని కాపాడాలి. మీ ప్రవర్తన వల్ల దళానికి చెడు పేరు రాకుండా దేశ సేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి” అని సూచించారు.

అనంతరం అస్సాం రైఫిల్స్ పరేడ్ మైదానం సమీపంలో ఏర్పాటు చేసిన ‘శౌర్య స్థల్’ స్మారక స్థూపాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల త్యాగాలను స్మరించుకునేలా ఈ స్మారక స్థలాన్ని నిర్మించారు.
