పేద వర్గాలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో కీలకంగా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు మంత్రి చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా సీఎం సహాయనిధి ద్వారా పేదలను ఆదుకుంటున్నామని తెలిపారు. వైద్యం కోసం అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న పేదలకు ఈ నిధి పెద్ద అండగా నిలుస్తోందన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో అనేక మంది ప్రాణాలను సీఎం సహాయనిధి కాపాడిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు తమకు వైద్య సహాయం అందేలా చేసినందుకు సీఎం మరియు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
