గిరిజన సంప్రదాయ ఆహారాన్ని ప్రోత్సహించే దిశగా ‘అరకు కౌని’ పేరుతో రూపొందించిన తొలి గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్ మెనూను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజున ఏర్పాటు చేసిన మిల్లెట్ ఆహార ఉత్పత్తుల స్టాల్ను సీఎం సందర్శించారు.
ఈ సందర్భంగా గిరిజనులు పండించిన కొర్రలు, రాగులు, సామలు, కాకిజొన్నలు, మొక్కజొన్న, కొండ కందులు, రాజ్మాతో తయారైన కొర్ర పాయసం, రాగి చపాతీ, సామల పులిహోర, అంబలి, కార్న్ వడ, తూర్ దాల్ కర్రీ వంటి వంటకాలను సీఎం పరిశీలించి రుచి చూశారు.గిరిజనుల ఆహార సంప్రదాయాలను గౌరవిస్తూ ఆరోగ్యకరమైన మిల్లెట్ ఆహారాన్ని ప్రోత్సహించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లలో ‘అరకు కౌని’ వంటకాలను మెనూలో చేర్చేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి Kinjarapu Atchannaidu, మంత్రి Gummidi Sandhya Rani తదితరులు పాల్గొన్నారు.
