ASR జిల్లా అరకు నియోజకవర్గంలోని మాడగడలో నిర్వహించిన ఎంఎన్ఆర్ఈజీఏ (మన్రేగా) పరిరక్షణ రచ్చబండ కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మన్రేగా పథకం పేదల జీవనోపాధికి బలంగా నిలిచిందని, కాంగ్రెస్ హయాంలో పథకం సమర్థవంతంగా అమలైందని ఆమె పేర్కొన్నారు.బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని బలహీనపరిచారని, ఉపాధి హామీ చట్టం ప్రకారం 100 రోజుల పని కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. పనికి 15 రోజుల్లో అవకాశం ఇవ్వకపోవడం, వేతనాలు ఆలస్యంగా చెల్లించడం వంటి సమస్యలను ప్రస్తావించారు.మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలు గ్రామస్వరాజ్యాన్ని దెబ్బతీస్తున్నాయని, ఉపాధి పనులను కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టి పథకాన్ని నీరుగార్చారని విమర్శించారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న నేపథ్యంలో కొత్త విధానాల వల్ల అదనపు భారం పడుతోందని, దీనిపై రాష్ట్ర నాయకత్వం స్పందించడం లేదని ఆమె అన్నారు.రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని షర్మిలా పేర్కొన్నారు.

