ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్షయ వ్యాధి కేసుల్లో భారత్లోనే 25 శాతం ఉండటం ఆందోళనకరమని ప్రభుత్వ క్షయ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ సుబాకర్ తెలిపారు.
క్షయ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు న్యూ ఏజ్ పల్మోనాలజిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని సంజీవయ్య పార్క్ వద్ద వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువ వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ గోవర్ధన్ రెడ్డి, డాక్టర్ వివేక్లతో కలిసి డాక్టర్ సుబాకర్ మాట్లాడుతూ 2030 నాటికి క్షయ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ టిబి ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. క్షయ వ్యాధి క్యాన్సర్ కాదని, సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందని చెప్పారు.అవగాహన లేకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని, క్షయ రహిత భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
