తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు “టీడీపీ 3.0 వర్షన్”ను అమలు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మంగళగిరిలో నిర్వహించిన ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్లతో మాట్లాడిన ఆయన, పార్టీ నిర్మాణంలో సమూల మార్పులు తీసుకురానున్నట్టు స్పష్టం చేశారు.

పార్టీలో క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలను నేరుగా గుర్తించడమే లక్ష్యమని, అందుకు సాంకేతికతను వినియోగిస్తూ ‘మై టీడీపీ’ యాప్ను తీసుకువచ్చామని తెలిపారు. శిక్షణా తరగతుల ద్వారా నాయకులకు బాధ్యతలపై అవగాహన పెంచుతున్నామని చెప్పారు.

2019–24 కాలంలో పార్టీ నాయకులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించిన లోకేష్, కలిసికట్టుగా పనిచేస్తే భవిష్యత్తులో మరింత విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. బూత్ స్థాయిలో బలహీనతలను గుర్తించి వాటిని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు.పార్టీలో ఒకే వ్యక్తి ఒకే పదవిలో ఎక్కువకాలం ఉండకూడదనే సంస్కరణలు తీసుకువస్తున్నామని, ప్రతి కార్యకర్తకు ఎదగడానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమంగా పనిచేసిన 19 మంది కార్యకర్తలకు వేదికపై ప్రత్యేక గౌరవం ఇవ్వనున్నట్టు తెలిపారు.కార్యకర్తే పార్టీకి బలం అని, వారిని ప్రోత్సహించడం ద్వారానే టీడీపీని మరింత శక్తివంతం చేయగలమని లోకేష్ పేర్కొన్నారు.
