2027 డిసెంబర్ నాటికి తెలంగాణ హైకోర్టు నూతన భవన సముదాయాల నిర్మాణాలను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైకోర్టు కొత్త భవన సముదాయ నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో 49 కోర్టులు, నివాస భవనాల నిర్మాణ ప్రాజెక్టులను కూడా చేపడుతున్నట్టు చెప్పారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్-II నూతన భవన నిర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పి ఎస్ నరసింహ , జస్టిస్ ఉజ్జల్ భుయాన్ , జస్టిస్ ఎస్ వెంకటనారాయణ భట్టి , జస్టిస్ అలోక్ ఆరాధే , తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ తో పాటు ఇతర న్యాయకోవిదులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “2023 డిసెంబర్లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు తీసుకున్న మొదటి నిర్ణయాల్లో హైకోర్టుకు కొత్త భవన సముదాయాన్ని నిర్మించాలన్న నిర్ణయం ఒకటి. అందుకోసం రాజేంద్రనగర్లో 100 ఎకరాలకు పైగా భూమిని కేటాయించాం. భవనాల కోసం జోన్-1లో ఇప్పటికే ప్రారంభించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు జోన్-2లో నివాస భవనాలకు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. వీటి నిర్మాణాలను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది” అని చెప్పారు.
