రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా ‘అరైవ్–అలైవ్’ గ్రామ సభలు నిర్వహించారు.ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో జరిగిన సభలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని, అంగన్వాడీ, ఆశా వర్కర్లు మరియు గ్రామ పెద్దలతో కూడిన 9 సభ్యుల రోడ్ సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాలను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో సీట్ బెల్ట్ వినియోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్యలను నివారించాలని హెచ్చరించారు.అపఘాతాల సమయంలో బాధితులకు సహాయం చేసిన వారికి ‘రహ్-వీర్’ పథకం కింద రూ.25 వేల ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు.గ్రామ సభలో ప్లాస్టిక్ నిషేధం, గంజాయి విక్రయాలపై సమాచారం అందించిన వారికి బహుమతి, హెల్మెట్ తప్పనిసరి, శబ్ద కాలుష్య నియంత్రణ వంటి పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

