నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. ఈ నెల 27 నుంచి మే 3 వరకు జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు, ట్రాఫిక్, పార్కింగ్, తాగునీరు, అన్నదానం, వైద్య సేవలు వంటి అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక వాహనాలు, 108 అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని సూచించారు.ఈ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ఆలయ అభివృద్ధికి భారీ నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక సేవలు, ఉచిత ప్రసాద పంపిణీ కూడా నిర్వహించనున్నారు.
