మాజీ ముఖ్యమంత్రి, వైయస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. కార్యకర్తలు, ప్రజలు, నాయకులతో మమేకమై వారి సమస్యలు, కష్టాలను విన్న ఆయన… “ఎవరూ అధైర్యపడొద్దు, మంచి రోజులు వస్తాయి” అంటూ ధైర్యం చెప్పారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని, అకారణ దాడులు జరుగుతున్నాయని పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేయగా, జగన్ స్పందిస్తూ పోరాట పంథాను కొనసాగించాలని పిలుపునిచ్చారు. త్వరలోనే తమ ప్రభుత్వం మళ్లీ వస్తుందని, అప్పుడు ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.ఇక ఆయన నివాసంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. కోదండ రామాలయం పండితులు సీతారాముల కల్యాణ తలంబ్రాలు, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయాల పరిరక్షణ, వేద విద్య ప్రోత్సాహంపై జగన్ చర్చించారు.పులివెందులలో జగన్ నివాసం కార్యకర్తలు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని నాయకులకు ఆయన సూచించారు.

