Hyderabad నగరంలో రిమాండ్ ఖైదీని కేవలం 30 నిమిషాల్లో పట్టుకున్న దబీర్పుర పెట్రోలింగ్ బృందాన్ని పోలీస్ కమిషనర్ V. C. Sajjanar అభినందించారు. బషీర్బాగ్లోని పాత పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సిబ్బందిని ఘనంగా సన్మానించారు.

విధుల పట్ల అంకితభావం చూపిన హెడ్ కానిస్టేబుల్ జావేద్, మహిళా కానిస్టేబుల్ శ్రావంతి, హోమ్ గార్డ్ మీర్ గయాస్ అలీలకు ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలు అందజేశారు.సోమవారం సాయంత్రం చంచల్గూడ క్రాస్రోడ్స్ వద్ద ట్రాఫిక్ సమయంలో, దొంగతనం కేసులో నిందితుడు సాగుల నరేష్ పోలీస్ వాహనం నుండి దూకి పరారయ్యాడు. సమాచారం అందుకున్న వెంటనే దబీర్పుర పెట్రోల్ బృందం అప్రమత్తమై, నల్గొండ మార్గంలోని ఓ హోటల్ సమీపంలో అతన్ని పట్టుకుంది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచిందని, ఇలాంటి చర్యలు ప్రజల్లో నమ్మకాన్ని మరింత బలపరుస్తాయని అన్నారు.

