హత్య కేసు నిందితుడికి ఆస్తి దక్కదని సుప్రీం కోర్టు తేల్చేసింది. ఒక వ్యక్తి హత్యకు పాల్పడినా లేదా దానికి సహకరించినా, ఆ మృతుడి ఆస్తిని పొందే హక్కును కోల్పోతారని స్పష్టం చేసింది. మృతుడు రాసిన వీలునామాలో నిందితుడి పేరు ఉన్నప్పటికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం, 1956లోని సెక్షన్ 25 ఆధారంగా ఈ తీర్పును వెలువరించింది.
జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఒక వ్యక్తి హత్యకు పాల్పడినా లేదా దానికి సహకరించినా, ఆ మృతుడి ఆస్తిని పొందే హక్కును కోల్పోతారని సెక్షన్ 25 చెబుతోందని, ఈ నిబంధన వర్తించడానికి, హత్య కేసులో నేరం రుజువై శిక్ష పడాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చి చెప్పింది. తప్పు చేసి దాని నుంచి ప్రయోజనం పొందడానికి ఎవరినీ అనుమతించకూడదు. ఈ సూత్రం ఆధారంగానే తీర్పు ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో కే రఘునాథ్ అనే వ్యక్తి హత్య కేసులో ఒకరు నిందితుడిగా ఉన్నారు. రఘునాథ్ తన ఆస్తిని ఆ నిందితుడికే చెందేలా వీలునామా రాశారని అతడు కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తాను నిందితుడినన్న విషయాన్ని అతడు కోర్టుకు తెలపలేదు. ఈ వాస్తవాన్ని దాచిపెట్టడం కూడా తీవ్రమైన తప్పిదమని కోర్టు అభిప్రాయపడింది. ట్రయల్ కోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించగా, హైకోర్టు అనుమతించింది. తాజాగా సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పును పక్కనపెట్టి ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఈ నిబంధన సహజ వారసత్వానికి, వీలునామా ద్వారా సంక్రమించే వారసత్వానికి కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. కాబట్టి కుటుంబ సభ్యులను చంపేసి ఆస్తిని అనుభవించాలనుకుంటే అది వీలుపడదని ఈ తీర్పు చెబుతోంది.
