డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. ఈ కేసులో అనంతబాబుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ పై ఉంటూ ఆయన ఈ కేసులో నలుగురు కీలక సాక్షులను ప్రలోభపెట్టడం, తమకు అనుకూలంగా మారకపోతే చంపుతామని బెదిరించడం లాంటి ఆరోపణలు ఉన్నాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం, అనంతబాబు బెయిల్ను రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. సాక్షులను బెదిరించిన వ్యవహారంలో ఏప్రిల్ 24న సర్పవరం పోలీసులు అనంతబాబును అరెస్ట్ చేయగా, ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ రద్దు కావడంతో, ఇకపై హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు ఆయన జైలులోనే ఉండనున్నారు. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఈ నెల 20వ తేదీ నుంచి రెగ్యులర్ విచారణ ప్రారంభించనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
