
45 డిగ్రీలకు చేరుతున్న ఉష్ణోగ్రతలు
సాయంత్రానికి వానలు.. ప్రజలకు ఉక్కపోత ఇబ్బందులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. మార్చి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేసినట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మార్చి నెలలోనే పలుచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఏసీల వినియోగం పెరిగి విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. మరోవైపు ఉక్కపోత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పగటి వేళ భగ్గుమనే ఎండలు, సాయంత్రానికి వానలు కురుస్తుండటంతో రెండు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పగటి సమయంలో 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది.
కర్నూలు, చిత్తూరు, కడప, అనంతపురం, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు చెప్పారు. సెగగాలులు, ఉక్కపోత వల్ల ప్రజలు బయటకు రావడానికే ఇబ్బందులు పడుతున్నారు.

