ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2 అందరూ ఆశించిన విధంగా ఆట ప్రారంభం కాలేదు. టాస్ సమయంలో గందరగోళం నెలకొంది. ముల్లన్పూర్లో జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచింది, కానీ అది కూడా టాస్ మళ్లీ వేసిన తర్వాతే అది సాధ్యమైంది. శుభ్మన్ గిల్ టాస్ వేస్తుండగా, రియాన్ పరాగ్ పిలుపు మ్యాచ్ రిఫరీ ప్రకాష్ భట్కు స్పష్టంగా వినిపించకపోవడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. బ్రాడ్కాస్టింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న రవిశాస్త్రి, టాస్ మళ్లీ జరుగుతుందని ఊహించని విధంగా ప్రకటించారు. మరోసారి టాస్ జరగగా, అది RRకు అనుకూలంగా వచ్చింది. దీంతో మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు.
ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్కు రాజస్థాన్ రాయల్స్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. రాజస్థాన్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. వైభవ్ సూర్యవంశీ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్కు తోడు రవీంద్ర జడేజా (35 బంతుల్లో 45 నాటౌట్), డొనోవన్ ఫెరీరా (11 బంతుల్లో 38 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి తృటిలో శతకం చేజార్చుకున్నాడు. ఆఖర్లో డొనోవన్ ఫెరీరా సృష్టించిన విధ్వంసంతో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోరును నమోదు చేసింది. సూర్యవంశీ దురదృష్టవశాత్తూ 96 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆఖర్లో ఫెరీరా నాలుగు భారీ సిక్సర్లు బాదాడు. గుజరాత్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 2 వికెట్లు, కగిసో రబడ 35 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి కాస్త ఫరవాలేదనిపించారు.

