17 ఏళ్ల సూర్య చౌహాన్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అసద్ ను ఎన్ కౌంటర్ చేశారు. శనివారం అర్ధరాత్రి ఘజియాబాద్ పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో అసద్ మరణించినట్లుగా మీడియా నివేదికలు తెలిపాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
బక్రీద్ పండుగ రోజున సూర్య చౌహాన్ను అసద్ హత్య చేసినట్లు పోలీసుల తెలిపారు. నగరం విడిచి పారిపోయే ముందు తన స్నేహితుడి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడానికి అసద్ ఖోడా (Khora) ప్రాంతానికి వస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. సమాచారం అందుకున్న ఘజియాబాద్ పోలీసులు ఆ ప్రాంతంలో మాటు వేశారు. అసద్ మరో వ్యక్తితో కలిసి మోటార్సైకిల్పై అక్కడికి చేరుకున్నాడు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, అసద్ వెంటనే పోలీసులపైకి కాల్పులు జరిపాడు.
పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అసద్కు బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ అసద్ మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ కాల్పుల ఘటనలో ఒక పోలీసు కానిస్టేబుల్ కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అసద్తో పాటు బైక్పై వచ్చిన రెండో వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుని పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఉపయోగించిన ఒక మోటార్సైకిల్ను, అలాగే కాల్పులకు వాడిన నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

