హైదరాబాద్: హైదరాబాద్లో మే నెలలో రికార్డు స్థాయిలో 3.36 లక్షల నీటి ట్యాంకర్ బుకింగ్లు నమోదయ్యాయి. బోర్వెల్లు ఎండిపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో నగరవాసులు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు.
రోజుకు 15 వేలకుపైగా ట్యాంకర్లకు డిమాండ్ ఉండగా, వాటర్ బోర్డు సుమారు 12 వేల ట్యాంకర్లనే సరఫరా చేస్తోంది. దీంతో డిమాండ్-సరఫరా మధ్య అంతరం పెరుగుతోంది.
గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, మణికొండ ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. నిర్మాణాలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య కార్యకలాపాలు పెరగడంతో భూగర్భ జలాలు గణనీయంగా తగ్గాయి. నగరంలోని మొత్తం ట్యాంకర్ డిమాండ్లో దాదాపు 20 శాతం ఈ పశ్చిమ ప్రాంతం నుంచే వస్తోంది.
ఇక బహదూర్పురా, గోల్కొండ, ఆసిఫ్నగర్ వంటి పాతనగర ప్రాంతాల్లో భూగర్భ జలాలు కొంత మెరుగ్గా ఉండటంతో ట్యాంకర్ల అవసరం తక్కువగా ఉంది.
సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వాటర్ బోర్డు ట్యాంకర్ల సంఖ్యను 1,135 నుంచి 1,250కు పెంచాయి. ఫిల్లింగ్ స్టేషన్లు, ఫిల్లింగ్ పాయింట్ల సంఖ్యను కూడా పెంచి 24 గంటల్లో ట్యాంకర్ సరఫరా లక్ష్యంగా చర్యలు చేపట్టాయి. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నుంచి తాగునీటి సరఫరా ప్రస్తుతం స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు.


