ఖర్గోన్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ, ఆమె 16 ఏళ్ల కుమార్తె మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
జిల్లా కేంద్రానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైటాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మగరియా గ్రామం సమీపంలో ఖండ్వా–బరోడా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఎదురుగా వస్తున్న కారును తప్పించేందుకు ప్రయత్నించిన మినీబస్సు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని జైటాపూర్ పోలీస్స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుదర్శన్ కలోసియా తెలిపారు. అదుపు తప్పిన మినీబస్సు ఓ మోటార్సైకిల్పై బోల్తా పడిందన్నారు. ఈ ఘటనలో మహిళ, ఆమె కుమార్తె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 17 మంది గాయపడ్డారని చెప్పారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.


