గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ (LPG) వంటగ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు రూ. 29 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంచిన ధరలు జూన్ 7 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 913 నుంచి రూ. 942కి పెరిగింది. గత మూడు నెలల వ్యవధిలో వంటగ్యాస్ ధరలు పెరగడం ఇది రెండోసారి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా భారతదేశానికి గ్యాస్ సరఫరా అయ్యే కీలకమైన హర్మూజ్ జలసంధి మార్గంలో ఏర్పడిన అంతరాయాలు దేశీయ ధరలపై ప్రభావం చూపాయి. ఈ సవరణకు ముందు వరకు చమురు సంస్థలు దేశీయ ఎల్పీజీ విక్రయాలపై సిలిండర్కు సుమారు రూ. 703 వరకు నష్టాన్ని భరిస్తూ వచ్చాయి.

