విజయ్ ఆంటోనీ.. ఆయన సినిమాలకు పలు భాషల్లో అభిమానులు ఉన్నారు. ఆయన ఇకపై సినిమాలు చేసే ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో తాను నటనకు, నగర జీవితానికి శాశ్వతంగా స్వస్తి పలికి ఒక మారుమూల పల్లెటూరిలో స్థిరపడనున్నట్లు చెబుతున్నారు. ఆయన తాజా చిత్రం ‘వంద దేవుళ్లు’ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ ఐటీ సంస్థ ‘జోహో’ అధినేత శ్రీధర్ వెంబు తనకు స్ఫూర్తి అని, ఆయనలాగే తాను కూడా పోల్లాచి లేదా కల్లకురిచ్చి వంటి ప్రాంతంలో స్థిరపడాలనుకుంటున్నట్లు తెలిపారు. పల్లెటూరిలో లభించే మానసిక ప్రశాంతత, స్వచ్ఛమైన గాలి, మనుషుల మధ్య ఉండే ఆప్యాయతలే నిజమైన ఆస్తి అని విజయ్ ఆంటోనీ చెప్పారు.
విజయ్ ఆంటోనీ, ‘బిచ్చగాడు’ దర్శకుడు శశి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం ‘వంద దేవుళ్లు’. ఒక యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కొన్నేళ్ల క్రితం కుమార్తె అకాల మరణం విజయ్ ఆంటోనీని మానసికంగా తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ విషాదం తర్వాతే ఆయన జీవితంపై తన దృక్పథాన్ని మార్చుకున్నారని, స్టార్డమ్, ఆడంబరాల కన్నా మానసిక ప్రశాంతతే ముఖ్యమని భావించి ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

