Hyderabad: ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ తమన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఓజీ టూర్ ఇండియా’ లైవ్ కన్సర్ట్కు వరుణ దేవుడు బ్రేక్ వేశారు. హైదరాబాద్లోని బౌల్డర్ హిల్స్లో శనివారం జరగాల్సిన ఈ కార్యక్రమం ప్రతికూల వాతావరణం కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ షోను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా కన్సర్ట్ ప్రాంగణం జలమయమైంది. సాయంత్రం 6:30 గంటలకు షో ప్రారంభం కావాల్సి ఉండగా, వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడంతో నిర్వాహకులు కన్సర్ట్ ను ఆపేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ కన్సర్ట్ తొలుత జూన్ 6న జరగాల్సి ఉండగా, అప్పుడు కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే వాయిదా పడింది. ఇప్పుడు రెండోసారి కూడా వాయిదా పడటంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. హైదరాబాద్ షోకు సంబంధించి త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని నిర్వాహక సంస్థలు ఏసీటీసీ ఈవెంట్స్, క్యాప్స్టాక్ వెల్లడించాయి.
ఈ షో రద్దు కావడంపై తమన్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “గత 45 రోజులుగా నా టీమ్లోని 56 మంది సభ్యులు ఈ ఈవెంట్ కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. ఆయనపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అభిమానుల ప్రేమతో మరింత బలంగా తిరిగి వస్తాను” అని పోస్టు పెట్టారు.


